తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు బ్యాట్స్మెన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. 229 పరుగుల లక్ష్యం గుజరాత్ టైటాన్స్ ముందుంచిన ముంబయి ఇండియన్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి 208 పరుగులకు గుజరాత్ టైటాన్స్ జట్టును కట్టడి చేశారు. ఎలిమినేటర్ లో గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో అహ్మదాబాద్ వేదికగా పోటీ పడనుంది. చండీగఢ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

హిట్టింగ్ తో చెలరేగిపోయిన ముంబయి ఇండియన్స్
IPL 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు బెయిర్స్టో గొప్ప ఆరంభం అందించారు. పవర్ప్లే ముగిసే సమయానికి ముంబయి జట్టు వికెట్ కోల్పోకుండా 79 పరుగులు సాధించింది. వీరిద్దరి జోడీ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నిలిపారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరియు రోహిత్ శర్మ 59 పరుగుల భాగస్వామ్యం సాధించగా, తిలక్ వర్మ మరియు రోహిత్ 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 81 పరుగులు సాధించిన రోహిత్ శర్మ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బెయిర్స్టో 47 పరుగులు, సూర్యకుమార్ 33 పరుగులు, తిలక్ వర్మ 25 పరుగులు మరియు హార్దిక్ పాండ్యా 22 పరుగులు సాధించి ముంబయి ఇండియన్స్ జట్టు స్కోరును 228 పరుగులకు చేర్చారు. గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ లో ప్రసిద్ కృష్ణ మరియు సాయి కిషోర్ తలో 2 వికెట్లు సాధించగా, సిరాజ్ 1 వికెట్ దక్కించుకున్నాడు.
ఇన్నింగ్స్ చివరలో తడబడిన గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరంభంలోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ 1 పరుగు వికెట్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో కోల్పోయినా సాయి సుధర్శన్ గొప్ప ప్రదర్శన కనబరిచి 80 పరుగులు సాధించాడు. పవర్ప్లే ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ జట్టు 66-1 పరుగులు సాధించింది. ఆ తర్వాత కుశాల్ మెండిస్ 20 పరుగులు సాధించి వెనుదిరిగినా, సాయి సుధర్శన్ మరియు వాషింగ్టన్ సుందర్ మధ్య 84 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఒక దశలో గుజరాత్ టైటాన్స్ జట్టు 229 పరుగుల లక్ష్యాన్ని సాధించగలదనే అనిపించినా ముంబయి ఇండియన్స్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో వరుస ఓవర్లలో వికెట్లు సాధించి గుజరాత్ జట్టును 208 పరుగులకే కట్టడి చేశారు. ముంబయి జట్టు బౌలింగ్ లో ట్రెంట్ బోల్ట్ 2 వికెట్లు సాధించగా, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్ మరియు అశ్వని కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ సీజన్ లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన సాయి సుధర్శన్ 759 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు.
For more IPL updates visit Sports