IPL 2025లో శనివారం జరిగిన డబుల్ హెడ్డర్లో రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో IPL చరిత్రలో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అవేశ్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

బౌలింగ్తో రాణించిన రాజస్థాన్ రాయల్స్:
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఆర్చర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత సందీప్ శర్మ బౌలింగ్లో నికోలస్ పూరన్ LBWగా వెనుదిరిగాడు. పవర్ప్లే ముగిసేసరికి లక్నో జట్టు స్కోరు 46/2గా ఉంది. అనంతరం హసరంగా బౌలింగ్లో పంత్ క్యాచ్ అవుట్ అయినా, మార్క్రమ్ మరియు ఆయుష్ బడోని కలిసి 76 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. చివర్లో వేగంగా పరుగులు చేసిన అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులు చేయగా, లక్నో జట్టు మొత్తం 180 పరుగుల స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలింగ్లో హసరంగా 2 వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్, తుషార్ తలో వికెట్ అందుకున్నారు.

లక్నో సూపర్ కంబ్యాక్:
181 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. 14 ఏళ్ల వయసులో తన తొలి మ్యాచ్ ఆడిన సూర్యవంశీ తన ఆటతీరు ద్వారా ఆకట్టుకున్నాడు. పవర్ప్లే ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా రాజస్థాన్ జట్టు 61 పరుగులు చేసింది. జట్టు బ్యాటింగ్లో అందరూ మంచి ప్రదర్శన కనబర్చినప్పటికీ, విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన సందర్భంలో లక్నో జట్టు బౌలర్ అవేశ్ ఖాన్ కేవలం 6 పరుగులే ఇవ్వడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. లక్నో బౌలింగ్లో అవేశ్ ఖాన్ 3 వికెట్లు తీసుకోగా, షార్దూల్ మరియు మార్క్రమ్ తలో వికెట్ అందుకున్నారు.
for more IPL updates visit Sports