IPL 2025 మ్యాచ్ నం.9లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడింది. పూర్తి ఆధిపత్యం సాధించిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మంచి ప్రదర్శన కనబరిచిన టైటాన్స్ జట్టు బౌలర్ ప్రసిద్ధ్ క్రిష్ణా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.

బ్యాటింగ్లో దూకుడు ప్రదర్శించిన టైటాన్స్:
గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ను దూకుడుగా ఆరంభించింది. టైటాన్స్ జట్టు ఓపెనర్లు శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ పవర్ప్లే ముగిసే సమయానికి 66 పరుగులు చేశారు. ఆ తరువాత, 9వ ఓవర్లో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ బౌలింగ్లో గిల్ క్యాచ్ అవుట్ కావడంతో, బట్లర్తో కలిసి సాయి సుదర్శన్ జట్టును ముందుకు నడిపించాడు. ముజీబ్ బౌలింగ్లో బట్లర్ (39 పరుగులు) క్యాచ్ అవుట్ అయిన సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టు స్కోర్ 129/2. ఆ తరువాత టైటాన్స్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోయింది. సాయి సుదర్శన్ 63 పరుగులతో గుజరాత్ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు సాధించగా, బౌల్ట్, చాహర్, ముజీబ్ మరియు సత్యనారాయణ తలో వికెట్ దక్కించుకున్నారు.
మొదటి నుంచే తడబడిన ముంబై:

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టును టైటాన్స్ సీమర్ సిరాజ్ ఇబ్బంది పెట్టాడు. 2వ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రోహిత్ (8 పరుగులు)ని బౌల్డ్ చేసిన సిరాజ్, 4వ ఓవర్లో మరో ఓపెనర్ రికెల్టన్ను కూడా బౌల్డ్ చేశాడు. పవర్ప్లే ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ జట్టు 48/2 స్కోర్ సాధించింది. ఆ తరువాత తిలక్ వర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ 62 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత తిలక్ వర్మ (39 పరుగులు) ప్రసిద్ధ్ క్రిష్ణా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. స్వల్ప వ్యవధిలోనే రాబిన్ మిన్జ్ మరియు సూర్యకుమార్ క్యాచ్ అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా 11 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో నమన్ దిర్ మరియు సాంట్నర్ వేగంగా పరుగులు చేసినా, అవసరమైన రన్రేట్ పెరగడంతో ముంబై ఓటమిపాలైంది. గుజరాత్ జట్టు బౌలింగ్లో సిరాజ్ మరియు ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు సాధించగా, రబాడా, సాయి కిషోర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
For IPL updates visit Sports